మహిళ కన్నీటి కథకు అండగా నిలిచిన శక్తి టీం
సాధన, వరలక్ష్మిల సేవలను అభినందించిన సీపీ డా. శంఖబ్రత బాగ్చి
విశాఖపట్నం, మే 1: అక్షర చాతుర్య
విశాఖ, గోపాలపట్నం బస్టాప్ వద్ద శుక్రవారం విశాఖ వెస్ట్ శక్తి టీమ్ మహిళా పోలీసులు సాధన, వరలక్ష్మిలు మహిళల మొబైల్స్లో శక్తి యాప్ ఇన్స్టాల్ చేస్తూ, ఆపద సమయంలో దాని వినియోగంపై అవగాహన కల్పిస్తున్న సమయంలో సుమారు 26 ఏళ్ల మహిళ తన 4 ఏళ్ల కుమారుడితో బస్టాప్లో కన్నీరుమున్నీరవుతూ కనిపించింది. వెంటనే స్పందించిన శక్తి టీమ్ ఆమెను పలకరించింది. బాబు ఆకలితో ఉన్నాడని తెలుసుకుని తల్లీబిడ్డలకు టిఫిన్ పెట్టించారు.
వివరాలు ఆరా తీయగా, ఆమె భర్తతో గొడవపడి 5 నెలలుగా వెంకటాపురంలోని తల్లి వద్ద ఉంటోందని తెలిసింది. కుమారుడి విషయంలో తల్లితో గొడవ జరగడంతో ఎటు వెళ్లాలో తెలియక బస్టాప్లో కూర్చుందని చెప్పింది.
వెంటనే శక్తి టీమ్ ఆమె తల్లికి ఫోన్ చేసి విషయం వివరించింది. వారు రాగానే ఇరువురికీ కౌన్సెలింగ్ ఇచ్చి, తల్లీకొడుకులను బాధితురాలి అక్కకు అప్పగించారు.
ఈ సంఘటనపై విశాఖ నగర పోలీస్ కమీషనర్ డా. శంఖబ్రత బాగ్చి స్పందించారు. ప్రజల భద్రతతో పాటు ఆపదలో ఉన్నవారికి ఆత్మీయంగా అండగా నిలిచిన శక్తి టీమ్ సభ్యులు సాధన, వరలక్ష్మిల సేవా దృక్పథాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
శక్తి యాప్ అవగాహన కార్యక్రమం చేస్తూనే, కష్టంలో ఉన్న మహిళను ఆదుకున్న పోలీసుల తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
