జీవీఎంసీ పరిధిలో భారీ భూస్కాం
ప్లాన్ కి విరుద్ధంగా మూడు రెట్లు నిర్మాణం !
వత్తాసు పలుకుతున్న జీవీఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులు
విశాఖపట్నం, జూలై 4
అక్షర చాతుర్య
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నార్త్ జోన్ పరిధిలో భారీ భూకబ్జా, అక్రమ నిర్మాణాల స్కామ్ వెలుగులోకి వచ్చింది.
టౌన్ ప్లానింగ్ అధికారుల అండతో నిబంధనలను గాలికొదిలి కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన ఘటన 41వ వార్డు ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తోంది.
ప్లాన్ ఒకటి – నిర్మాణం మరొకటి
మాధవధార సీతన్న గార్డెన్స్లో బీపీ నంబర్: 1086/1721-బి/జెడ్/ఎన్ఆర్/2025తో జీవీఎంసీ సిస్టమ్ ద్వారా మంజూరైన ప్లాన్ ప్రకారం రోడ్డు విస్తరణ పోను మొత్తం స్థలం 394.33 చదరపు గజాలు మాత్రమే.
నిబంధనల ప్రకారం 208.28 చ.గజాల్లో నిర్మాణం చేసి, చుట్టూ 186 చ.గజాల సెట్బ్యాక్ వదలాలి. 4 ప్లాట్లకు మాత్రమే అనుమతి ఉంది. కానీ అక్కడ ఏకంగా 12 ప్లాట్లను నిర్మించారు.
హద్దులు దాటి నిర్మాణ సామ్రాజ్యం
అనుమతి పొందిన ప్లాన్ హద్దులను దాటి పక్కనే ఉన్న అదనపు స్థలాన్ని కూడా ఆక్రమించి భవనాలు నిర్మించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని వెనుక రూ. 8 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయనే చర్చ జరుగుతోంది.
అధికారులారా కళ్ళు మూసుకున్నారా ?
ఈ జోన్ పరిధిని పర్యవేక్షించాల్సిన టౌన్ ప్లానింగ్ ఏసీపీ తిరుమల రావు, టీపీటీ పవన్ కళ్లు మూసుకున్నారని ప్రజలు మండిపడుతున్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.
వెంటనే విచారణ జరపాలి: 41వ వార్డు ప్రజలు
ప్లాన్లో చూపిన స్థలం కంటే అదనంగా నిర్మించడం నేరమని, దీనిపై వెంటనే విజిలెన్స్ విచారణ జరపాలని 41వ వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులైన ఏసీపీ తిరుమల రావు, టీపీటీ పవన్లను సస్పెండ్ చేయాలని, అక్రమంగా నిర్మించిన ప్లాట్లను వెంటనే కూల్చివేయాలని వారు కోరుతున్నారు.
జీవీఎంసీ కమిషనర్ ఈ అక్రమాలపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.
