70 యూనిట్లకు పైగా సేకరణ
విశాఖపట్నం, ఏప్రిల్ 25: అక్షర చాతుర్య
డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని నేవల్ డాక్ యార్డ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు సామాజిక స్పృహ చాటుకున్నారు. మెగాద్రిపేట రెసిడెన్షియల్ కాలనీలోని కళామెగా ఏసీ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 70 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి రోటరీ బ్లడ్ బ్యాంకుకు అందజేశారు.

నేవల్ డాక్ యార్డ్ ఎస్సీ ఎస్టీ అప్ లిఫ్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చీఫ్ మెడికల్ ఆఫీసర్ సుజిత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం శిబిరాన్ని ప్రారంభించారు.
ఎండను సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు రక్తదానం చేశారు. మహిళా ఉద్యోగులు కూడా ఉత్సాహంగా పాల్గొని ఆదర్శంగా నిలిచారు. 135వ జయంతి సందర్భంగా 135 యూనిట్ల రక్తం సేకరించాలనే లక్ష్యంతో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

“సరైన సమయంలో రక్తం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు” అని అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మాస ప్రకాష్ రావు, ప్రధాన కార్యదర్శి కోటి రాంబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ బుడుమూరి భోగేశ్వరరావు పేర్కొన్నారు.
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రక్తదానం చేసిన ఉద్యోగులను అభినందించిన బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, దాతలకు వాటర్ బాటిల్, బ్లడ్ డోనర్ సర్టిఫికెట్లు అందజేశారు. ప్రతి ఏటా ఇలాంటి శిబిరాన్ని నిర్వహిస్తామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బుడుమూరి జగదీష్, జాయింట్ సెక్రటరీ బత్తుల విజయ్ కుమార్, ఎల్ల బిల్లి సన్నీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.వి. రంగారావు, కోడి మురళి, శివరాజ్, సునీల్ కుమార్, రాజశేఖర్ తో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు రెడ్డి వెంకట్రావు, సబ్బం కిరణ్ కుమార్, జి. అరుణ్ కుమార్, భానోజీ బిళ్ళ, కుమార్ ఎడ్ల రాజేష్, విజయ్ కృష్ణ, భూపతి, వడ్డాది హరి తదితరులు పాల్గొన్నారు.
