మరోసారి ఎల్పీజీ ధరల మోత..
సామాన్యుడి నడ్డి విరుస్తున్న భారం
విశాఖ, జూన్ 7
అక్షర చాతుర్య ప్రత్యేక ప్రతినిధి
దేశవ్యాప్తంగా మరోసారి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగి సామాన్య ప్రజల గుండెల్లో గుబులు రేపాయి. 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై రూ.29 పెంపును చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించడంతో, ఇప్పటివరకు రూ.913గా ఉన్న సిలిండర్ ధర రూ.942కు చేరుకుంది. ఆదివారం (జూన్ 7) నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.
ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఇది మరో గట్టి దెబ్బగా మారింది. కూరగాయల ధరలు, విద్యుత్ చార్జీలు, పెట్రోల్, డీజిల్ భారం నుంచి కోలుకోకముందే వంటగ్యాస్ ధరలు మళ్లీ మండిపోవడం కుటుంబ బడ్జెట్ను తలకిందులు చేస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరల పెరుగుదల, పశ్చిమాసియా ఉద్రిక్తతలే ఈ పెంపుకు కారణమని చమురు సంస్థలు చెబుతున్నప్పటికీ, ప్రజల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత మార్చిలోనే రూ.60 పెంచిన ప్రభుత్వం, కేవలం మూడు నెలల వ్యవధిలో మరోసారి ధర పెంచడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
“సబ్సిడీ పేరుతో మాటలు.. కానీ భారం మాత్రం ప్రజలపై!” అంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న మధ్యతరగతి ప్రజలకు ప్రతి నెల గ్యాస్ బిల్లు అదనపు మోతగా మారిందని గృహిణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల సహనాన్ని పరీక్షించేలా వరుస ధరల పెంపులు కొనసాగితే, రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేకత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. “ధరల నియంత్రణపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే, సామాన్యుడి వంటింట్లో మంటలు కాకుండా ఆగ్రహ జ్వాలలు రగిలే పరిస్థితి వస్తుంది” అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను గుర్తించి, గ్యాస్ సిలిండర్ ధరలపై ఉపశమనం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
