ఉత్తర్వులు అందజేసిన కమిషనర్ కేతన్ గార్గ్
విశాఖపట్నం, జూలై 22
అక్షర చాతుర్య
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న 25 మంది ఉద్యోగులకు పదోన్నతులు లభించాయి.
ఇందులో 6 మంది జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లుగా, వివిధ కేడర్లకు చెందిన 19 మంది జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. రోస్టర్ పద్ధతిలో అర్హత కలిగిన వారికి బుధవారం తన కార్యాలయంలో కమిషనర్ కేతన్ గార్గ్ ఉత్తర్వులు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జీవీఎంసీలో బాధ్యతతో, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఉద్యోగులందరూ కంప్యూటర్ పరిజ్ఞానం, ఫైల్ డ్రాఫ్టింగ్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, ప్రభుత్వ నిబంధనలపై అవగాహన ఉంచుకోవాలని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత పదవులకు ఎదిగేందుకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు.
ఏ విభాగంలో విధులు అప్పగించినా సక్రమంగా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉండాలని, విధి నిర్వహణలో అలసత్వం, అవినీతి వంటివి సహించబోమని స్పష్టం చేశారు.
పదోన్నతి పొందిన ఉద్యోగులకు అన్ని విభాగాల్లో పనిచేసే అవకాశం కల్పించేలా కొద్దిరోజుల పాటు శిక్షణ ఇవ్వాలని అదనపు కమిషనర్ పి.ఎం. సత్యవేణిని కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి పి. పద్మజ, పర్యవేక్షకులు రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
