రాజకీయ పునర్జన్మ నిచ్చింది వైఎస్సార్.. వెన్నంటి నిలిచింది జగనన్న —
ఆల్ఫా కృష్ణ భావోద్వేగం
విశాఖపట్నం:మే 26
అక్షర చాతుర్య
ఒకప్పుడు రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఆకలి బాధలను చూసిన వ్యక్తిగా నేడు అనేకమంది పేదల ఆకలి తీర్చే అన్నదాతగా మారానని ప్రముఖ సామాజిక కార్యకర్త, ‘గోల్డెన్ ఆల్ఫా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు ఆల్ఫా కృష్ణ పేర్కొన్నారు. తన ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రోజు 50మందికి అన్నదానం చేస్తున్నారు. ఈ అన్నదాన ప్రక్రియను జూన్ 1 నుంచి విస్తృతం చేస్తున్న తరుణంలో డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
2015 మార్చి 21న స్థాపించిన గోల్డెన్ ఆల్ఫా ఫౌండేషన్ ద్వారా పేద, ధనిక అనే తేడా లేకుండా ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామన్నారు.
ఈ సందర్బంగా తన జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకుని ఆల్ఫా కృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు.
ఆ నాటి ఆకలి.. నేటి సంకల్పంగా మారిందన్నారు.
1976 నుండి 1982 వరకు తాను స్వయంగా తీవ్రమైన ఆకలి బాధలను అనుభవించానని ఆల్ఫా కృష్ణ తెలిపారు. 1979లో రైల్వే స్టేషన్ దగ్గర ఆకలితో ఉన్న సమయంలో కొందరు ఫుడ్ ప్యాకెట్లు పంచుతుండటం చూసి.. భవిష్యత్తులో నేను కూడా ఇలా పది మందికి అన్నం పెట్టగలనా అని దేవుడిని ప్రార్థించానన్నారు.
ఆ సంకల్పమే నేడు గోల్డెన్ ఆల్ఫా ఫౌండేషన్ స్థాపనకు పునాది అని పేర్కొన్నారు.తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి దేవుడితో పాటు ముగ్గురు వ్యక్తులు కారణమని కృష్ణ చెప్పారు.
తనకు జన్మనిచ్చింది దేవుడైతే.. రాజకీయంగా పునర్జన్మను ఇచ్చి, జీవితాన్ని ప్రసాదించిన ఆత్మీయ తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డని కొనియాడారు. అలాగే ఉభయ రాష్ట్రాలలో తనను ఒక నాయకుడిగా గుర్తించి, ఎన్నో సందర్భాల్లో తనకు అండగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఎప్పటికీ మరచిపోలేనన్నారు. వైఎస్సార్, జగనన్నల సపోర్ట్ లేకపోతే ఈ రోజు ఆల్ఫా కృష్ణ లేడని ఆయన స్పష్టం చేశారు.
వాళ్లను స్ఫూర్తి గా తీసుకుని నేడు సమాజ సేవకు అంకితమాయ్యనన్నారు.
ఇకపై రోజు 90 మందికి అన్నదానం !
వచ్చే నెల జూన్ 1 నుంచి తన హోటల్ వద్ద ప్రతీ రోజు 90 మంది అన్నార్థులకు చక్కని భోజనం అందించే ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇది కొత్తగా జరిగే ప్రక్రియ కాదని ప్రస్తుతం రోజు 50 మందికి అందిస్తున్న ఆహారం ఇకపై 90 మందికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
