ట్రాఫిక్ చలానాలు, ప్రమాదాలతో విసిగిపోయి ఆగ్రహం..
విశాఖపట్నం (వేపగుంట), ఏప్రిల్ 26: అక్షర చాతుర్య
విశాఖలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో తండ్రే స్వయంగా కొడుకు బైక్ను తగలబెట్టిన ఘటన కలకలం రేపింది.
వేపగుంట సమీపంలోని బంటాకాలనీకి చెందిన ఓ ఆటో డ్రైవర్, తన కుమారుడి కోరిక మేరకు ఏడాది క్రితం బైక్ కొనిచ్చారు. కళాశాలకు వెళ్లిరావడానికి కొనిచ్చిన ఆ బైక్పై కుమారుడు స్నేహితులతో కలిసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇష్టారీతిన తిరగసాగాడు. ఫలితంగా వరుసగా ట్రాఫిక్ చలానాలు ఇంటికి వచ్చాయి.
గతేడాది జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కుమారుడికి గాయాలవడంతో ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం తండ్రి సుమారు రూ. లక్ష వరకు వెచ్చించాల్సి వచ్చింది. అయినా కుమారుడి తీరు మారలేదు. తాజాగా ట్రిపుల్ రైడింగ్ కారణంగా మళ్లీ జరిమానా పడడంతో తండ్రి సహనం కోల్పోయారు.
“బైక్ కొనివ్వడం వల్లే నా కొడుకు ఇలా తయారయ్యాడు” అని ఆగ్రహించిన తండ్రి, వాహనాన్ని కాలనీకి దూరంగా తీసుకెళ్లి నిప్పంటించారు. ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
