ఎల్జి పాలిమర్స్ ఘటనలో జగన్ ఇచ్చినట్టే ఇవ్వాలి ..
వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ డిమాండ్..
విశాఖపట్నం , అక్షర చాతుర్య
జూన్ 13
ఎల్జి పాలిమర్స్ ఘటనలో మృతుల కుటుంబాలకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రూ. కోటి నష్ట పరిహారం అందజేసిన విధంగానే, స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కూడా రూ. కోటి పరిహారం ప్రకటించాలని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ డిమాండ్ చేశారు.
శనివారం మద్దిలపాలెంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చరిత్రలో ఎక్కడా ఇలాంటి భారీ పరిహారం ఇవ్వలేదని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు మాజీ సీఎం జగన్ తగిన ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు.
విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కార్మిక సంఘాలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని ఆయన విమర్శించారు. స్టీల్ ప్లాంట్ అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
ఎల్జి పాలిమర్స్ ఘటనలో ఎంఎన్సి కంపెనీ ప్రతినిధులను వైసీపీ ప్రభుత్వం జైలుకు పంపిన చరిత్ర తమదని ఆల్ఫా కృష్ణ చెప్పారు. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తన స్థాయికి తగ్గట్టు మాట్లాడటం లేదని, ఆమె పనితీరు రాజ్యాంగబద్ధంగా లేదని ఆరోపించారు.
తమ పార్టీ అధినేత జగన్ బయటకు వస్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించిన ఆయన, కమ్యూనిస్ట్ నేతలను కాల్చిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. కార్పొరేట్ వర్గాలకు రూ. 99 పైసలకే భూములు కట్టబెట్టడాన్ని ‘సంపద సృష్టి’ అంటారా అని నిలదీశారు.
మీడియా సమక్షంలో హోం మంత్రి అనిత బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రజలకు చేసిన మంచిపై చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేసిన ఆల్ఫా కృష్ణ, అనిత తీరు మార్చుకోకపోతే ధీటుగా బదులిస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పనిచేసే తమను ప్రభుత్వం బెదిరిస్తే భయపడేది లేదన్నారు.
వైఎస్. జగన్ ఆలోచనా విధానమే రాష్ట్ర అభివృద్ధికి శరణ్యమని, ప్రజలు మళ్లీ వైసీపీ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
