కాషాయ జెండాలతో మార్మోగిన నగర వీధులు
విశాఖపట్నం, ఏప్రిల్ 25:
అక్షర చాతుర్య
హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నగరంలో హనుమాన్ శోభా యాత్ర అత్యంత వైభవంగా జరిగింది.
విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆర్&బి జంక్షన్ వద్ద జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ ర్యాలీ ఆర్&బి జంక్షన్ నుంచి ఆర్కే బీచ్ వరకు సాగింది.
శోభాయాత్రలో జీవీఎంసీ 48వ వార్డు మాజీ కార్పొరేటర్, మాజీ స్టాండింగ్ కమిటీ మెంబర్, మాజీ బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు యాదవ్ భారీ సంఖ్యలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. ఆమె ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుతో కలిసి కాషాయ జెండాలతో ర్యాలీలో నడిచారు.
వేలాది మంది భక్తులు కాషాయ టోపీలు, కండువాలు ధరించి, ద్విచక్ర వాహనాలకు ఆంజనేయస్వామి చిత్రపటాలతో కూడిన జెండాలను కట్టుకుని ‘జై శ్రీరాం’ నినాదాలతో నగరాన్ని మార్మోగించారు.
ఈ సందర్భంగా గంకల కవిత అప్పారావు మాట్లాడుతూ, “కులమతాలకు అతీతంగా హిందువుల మనోభావాలను కాపాడేందుకు నిర్వహించిన ఈ విజయోత్సవ ర్యాలీలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం సంతోషకరం. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.
శోభాయాత్రలో హిందూ బంధువులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొని సాంస్కృతిక స్ఫూర్తిని చాటారు. కాషాయ జెండాల రెపరెపలు, ‘జై శ్రీరాం’ నినాదాలతో విశాఖ నగర వీధులు హోరెత్తాయి.
